“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు.
కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పురాణ కథలు, జానపద కథలు వంటి కథా సాహిత్యం, మల్లాది, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ కవుల సాహిత్య విశేషాలు, ఇంకా, సాహిత్యంలో సరదా పద్యాలు, చాటు పద్యాలు, విశ్వనాథ వారి "మిహిరకులుడు", పింగళి నాగేంద్రరావు గారి "జేబున్నీసా" వంటి వన్నెకెక్కిన పుస్తకాల పరిచయాలు, ఆదిశంకరులు, కాళిదాసు వంటి ప్రాచీన మహాకవుల కవిత్వ పరిచయాలు, ఇంకా, మన భాషాసాహిత్యాలపై ఆసక్తి కలిగించే మరెన్నో అంశాలు, మన "అజగవ ఛానల్" అనే సాహితీ ధనువు నుండి బాణాల్లా దూసుకు వస్తాయి. మన అజగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె
Contact email: rajanptsk@gmail.com
Facebook: www.facebook.com/rajanptsk
Quora: te.quora.com/profile/Rajan-PTSK
Ajagava
అందంగా తెలుగు మాట్లాడాలని ఉందా?
https://youtu.be/DCpUtdnn9Ds
విభక్తులు నేర్చుకుంటే భాష మీద పట్టు పెరిగి, మనం మాట్లాడే తీరు ఇంకా అందంగా మారుతుంది. మాటతీరు మెరుగైతే మన మీద మనకు విశ్వాసం పెరగడంతో పాటూ, నలుగురిలో గౌరవం కూడా రెట్టింపవుతుంది. వ్యాకరణం అనేది కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు, జీవితంలో ఎదగడానికి కూడా!
అందుకే మన అజగవ కుటుంబ సభ్యుల కోసం విభక్తులను సరళమైన ఉదాహరణలతో వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే, మీకు విభక్తులను ఎందుకు వాడాలి?, ఎలా వాడాలి? అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి.
https://youtu.be/DCpUtdnn9Ds
6 days ago (edited) | [YT] | 304
View 1 reply
Ajagava
https://youtu.be/shh9iW95vAE
పాత పాటల గురించి కాసేపు హాయిగా మాట్లాడుకుందాం రండి!!
"నారీ నారీ నడుమ మురారి" అని అందమైన ప్రయోగం చేసినవారు సముద్రాల గారు.
"రాజశేఖరా నీపై మోజు తీరలేదురా", "దరికి రాబోకు రాబోకు రాజా" వంటి వంటి సూపర్ హిట్ పాటలు వ్రాసినవారు సముద్రాల గారు.
ఈనాటికీ పెళ్ళిళ్లలో వినబడే "సీతారాముల కళ్యాణము చూతము రారండి" పాట కూడా సముద్రాల గారు వ్రాసిందే.
ఇంకా...
లవకుశ, భూకైలాస్, దొంగరాముడు, లైలామజ్నూ, నర్తనశాల, విప్రనారాయణ, అనార్కలి, షావుకారు, అమరశిల్పి జక్కన వంటి సూపర్ హిట్ సినిమాలలో ఎన్నో పాటలు రచించారు సముద్రాల గారు.
ఒక్కమాటలో చెప్పాలంటే..
నాటకం తరహాలో సాగిపోయే తెలుగు సినిమా పాటకు కొత్త నడకను నేర్పి, ఈనాటి తెలుగు పాటకు ఏనాడో బాటను వేసిన పయనీర్ మన సముద్రాల రాఘవాచార్యులుగారు.
దేవత (1941) సినిమాలో ఓ సందర్భానికి తగ్గట్టుగా "రాదే చెలీ నమ్మరాదే చెలీ - మగవారీనిలా నమ్మరాదే చెలీ" అని వ్రాసిన సముద్రాల గారు, సతీ సక్కుబాయి సినిమాలో ఒక సరదా సందర్భానికి తగ్గట్టుగా... "నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా" అని వ్రాశారు.
అందులో ఆయన "పకపక నవ్వే పడతిని నమ్మి - తికమక పడి చెడిపోవకురా - దినదిన గండం అది సుడిగుండం - పడితే నీ పని బెకబెక లేరా" అంటూ నవ్విస్తారు.
ఇక "రారోయి మా యింటికి మావో మాటున్నది మంచి మాటున్నది" పాట All Time Great Hits లో ఒకటి. ఆ పాట ఇప్పుడు విన్నా మనసుకు హాయిగా ఉంటుంది. అందులో ఆయన...
"నువ్వు నిలుసుంటె నిమ్మసెట్టు నీడున్నది - నువ్వు కూసుంటె కురిసీల పీటున్నది - నువ్వు తొంగుంటె పట్టెమంచం పరుపున్నది - మాటున్నది మంచి మాటున్నది"- అంటూ జానపద శైలిలో పదాలను పరుగులు పెట్టించారు.
సముద్రాల గారి తొలిపాటకు ఇప్పుడు 90 యేళ్ళు. ఆ గొప్ప రచయిత పాటల్లోని మధురిమలను మరలా మనవారందరికీ గుర్తుచెయ్యడానికి మన అజగవ Youtube channel లో 23 నిమిషాల వీడియో చేశాను.
సాహితీ ప్రియులంతా ఆ వీడియో చూసి హాయిగా ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని భావిస్తున్నాను. ఆ వీడియో లింక్ ను ఈ పోస్ట్ మొదట్లోనే ఇచ్చాను.
మీరు చూడటంతో పాటూ పాత పాటల్ని అభిమానించేవారికి కూడా ఈ వీడియోను షేర్ చేస్తే.. ఉత్తమ సాహిత్యాన్ని మీరు కూడా వ్యాప్తి చేసినవారవుతారు.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె.
2 weeks ago (edited) | [YT] | 152
View 3 replies
Ajagava
ఇటువంటి విషయాలపై అవగాహన వస్తే, వీటిని మీరు మీ పిల్లలకు చెప్పడం సులభం అవుతుంది. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అవయవాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగాను, విజ్ఞానదాయకంగాను ఉంటుంది. నేర్చుకోవడం ఎప్పుడూ గొప్పదే! ఈ లింక్ క్లిక్ చేసి మన అజగవలో ఉన్న వీడియోను పూర్తిగా చూడండి. https://www.youtube.com/watch?v=O4A2f...
1 month ago (edited) | [YT] | 151
View 2 replies
Ajagava
"జై శ్రీరామ్" అన్న మాట ఆసేతుహిమాచలాన్ని ఏకీకృతం చేయగలిగే జాతీయ నినాదం.
"జయ శ్రీరామ" అన్న మాట మనలో ఆధ్యాత్మిక శక్తిని నింపగలిగే తారకమంత్ర స్వరూపం.
రామ నామం గొప్పతనం గురించి, జై శ్రీరామ్ - జయ శ్రీరామ మధ్య ఉన్న భేదం గురించి తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=smyTs...
1 month ago | [YT] | 139
View 0 replies
Ajagava
సినీ మహాకవి అయిన వేటూరి గారు రాసిన 'మాలధారణం - నియమాలతోరణం' అనేది కేవలం సినిమా పాట మాత్రమే కాదు... అది ఒక జీవన మంత్రం. ఆధ్యాత్మిక సూత్రం.
ఆ పాటలో ప్రతీ పదం వెనుక ఉన్న ఆధ్యాత్మికతను వివరించడానికి ప్రయత్నించాను.
ఈ వీడియో చూశాక, ఆ పాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
స్వామియే శరణం అయ్యప్ప!
వీడియో లింక్: https://www.youtube.com/watch?v=hHMgm...
6 months ago | [YT] | 208
View 1 reply
Ajagava
"ఇలాంటివి నాకే ఎందుకు జరుగుతాయ్!" - చిన్ననాటి ముచ్చట్లు!
అప్పుడు నేను ఆరో తరగతో ఏడో తరగతో అనుకుంటాను. ఆరోజు నేను అన్నం తిననని కరాఖండీగా చెప్పేసేసరికి మా అమ్మ అరచేయి, నా వీపు, రెండు మూడు సెకండ్ల కాలంలో నాలుగైదుసార్లు గబగబా మాట్లాడేసుకున్నాయి. ఆ చర్చల ఫలితంగా నేను అన్నం తినక తప్పింది కాదు. అటువంటి చర్చలు చిన్నప్పటి నుండి అనేకమార్లు జరిగినా, ఆ వేళెందుకో.. “నాకే ఎందుకిలా జరుగుతోందని” దుఃఖం పొంగుకొచ్చింది. కానీ తమాయించుకుని కళ్ళు తుడుచుకున్నాను. లేదంటే.. తిన్న అన్నం ఏడుపువల్ల అరిగిపోయుంటుందని చెప్పి, మళ్ళా ఒక రౌండు చర్చలు జరిపైనా సరే అన్నం పెట్టేస్తుంది మా అమ్మ. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. “అడగందే అమ్మైనా అన్నం పెట్టదు” అన్న సామెత పచ్చి అబద్దం. ఆ సామెత ఎలా పుట్టిందో నాకు తెలియదు? ఒకవేళ తెలుసుకునేందుకు అప్పట్లో పరిశోధన జరిపినా ఫలితం ఉండేది కాదు. ఏమంటే.. ఈలోగా భోజనం టైమ్ అయితే, మళ్ళా మా అమ్మ అన్నం పెట్టేస్తుంది. కాదూ కూడదంటే.. ఇంకో రౌండు చర్చలు జరిపేస్తుంది. అందుకే కిక్కురుమనకుండా తినేసి కోపంతో ముసుగుతన్ని పడుకున్నాను.
ఆ మర్నాడు స్కూల్కి వెళ్లగానే.. అప్పట్లో నాకు మూడింతలు బరువుండే నా ప్రాణస్నేహితుడు మురళీ దగ్గరకు వెళ్లాను. వాడితో రహస్యంగా.. “ఏరా! తిండి తినే విషయంలో మీ అమ్మగారు నిన్ను కొడతారా?” అని అడిగా! వాడు నావంక పరమ ఆశ్చర్యంగా చూస్తూ.. “నిన్ననే కొట్టిందిరా మా అమ్మ! అయినా.. ఏ!!” అన్నాడు... ఇంటర్వెల్లో కొనుక్కున్న రేగొడియాన్ని చప్పరిస్తూ. వాడా మాట అనగానే నాకు బలే సంబరమేసింది. “ఆ సంగతి తరువాత చెబుతా కానీ.. ముందు ఎందుకు కొట్టారో చెప్పు?” అన్నా కాసింత ఆనందంగా. దానికి వాడు.. “నిన్న రాత్రి అందరం అన్నాలు తినేసి పడుకున్నాం. అర్ధరాత్రెప్పుడో నాకు మెలకువ వచ్చింది. నిద్ర పట్టడం లేదని, వంటింట్లోకెళితే.. అక్కడ దేవుడి గూడు దగ్గర ఒక కొబ్బరి చెక్క కనిపించింది. మళ్ళా ఎవరైనా లేస్తారేమో అని దానిని చాలా జాగ్రత్తగా నేలమీద నాలుగైదుసార్లు కొట్టి ముక్కలుగా చేశా. కొబ్బరిముక్కను బెల్లంముక్కతో కలిపి తింటే బలేగా బావుంటుంది కదరా! అందుకని ఒకపక్క కొబ్బరిముక్కలు నములుతూనే, పై గూట్లో డబ్బాలన్నీ వెదకి బెల్లం ముక్క కూడా సంపాదించా. ఇంతలో పొరపాటున ఒక డబ్బా పైనుండి క్రింద పడింది. ఏ పిల్లి వచ్చేసిందో అనుకుంటూ మా అమ్మ నిద్దర్లేచి కంగారుగా వంటింట్లోకి వచ్చింది. ఇంకేముంది.. ఒక చేత్తో కొబ్బరిముక్క, ఇంకో చేత్తో పెద్ద బెల్లంముక్క పట్టుకుని, నోట్లో కొబ్బరి నెమరేస్తూ మా అమ్మ కంట పట్టాను. చెయ్యి అడ్డు పెట్టుకోవడానికి కూడా లేదు! “అర్ధరాత్రివేళ ఈ తిళ్ళేమిట్రా నీకు? అరుగుతాయా అసలు!!” అంటూ వీపు విమానం మోత మోగించేసింది” అన్నాడు ఉక్రోషంగా. “ఓ అందుక్కొట్టారా!” అన్నా ఉసూరుమనుకుంటూ. ఏ “మీ అమ్మ నిన్నెందుక్కొట్టారు” అన్నాడు తిరిగి. “ఏం లేదులే!” అని ఊరుకున్నా.
మురళీ వాళ్ళ అమ్మగారిది, మా అమ్మది ఒకటే పంథా. ఎప్పుడూ మా కోసం రకరకాల వంటలు, పిండివంటలు రుచిగా చేసి, కొసరి కొసరి మరీ తినిపించేవారు. ఇద్దరం అమ్మకూచీలమే. కాకపోతే, అసలు తిండి తినడం లేదని నాతో మా అమ్మ, తినడం ఆపడం లేదని వాడితో వాళ్ళమ్మగారు అప్పుడప్పుడూ అలా ఫలప్రదమైన చర్చలు జరుపుతుండేవారు.
ఆవిధంగా, నాకే ఎందుకిలా జరుగుతోందన్న భావన నాకు పుష్కరం వయసున్ననాడే కలిగింది. చరిత్రలో పాతిపెట్టిన తన కొబ్బరిచెక్కను, బెల్లంముక్కను బయటకు తీసి, ఇలా అజగవలో బహిరంగ ప్రదర్శనకు ఉంచడం కనుక మా మురళీ చూస్తే.. “నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేశాడు ఈ రాజాగాడు; అసలు ఇలాంటివి నాకే ఎందుకు జరుగుతాయ్!” అని భోంచేస్తూ బాధపడిపోవడం మాత్రం ఖాయం!!
స్వస్తి!
మీ
రాజన్ పి.టి.ఎస్.కె.
9 months ago | [YT] | 560
View 63 replies
Ajagava
రామాయణం ప్రతీకాండలోనూ శివ భగవానుడి ప్రస్తావన ఉంటుంది. కామదహనం, కుమారస్వామి జననం, హాలాహల భక్షణం, గంగావతరణం ఇలా రామాయణంలో శివుడి సంబంధమైన కథలు చాలానే ఉంటాయి. ఈ కథలన్నీ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రులవారు రామలక్ష్మణులకు చెప్పినటువంటి కథలు. శివ కుమారుడైన కుమారస్వామిని పూజిస్తే సకలసంపదలు కలుగుతాయన్నది సాక్షాత్తూ రామాయణం చెప్పే మాట.
అలానే గంగాదేవికి ఆ పవిత్రత శివుడి శరీరాన్ని తాకడం వల్లనే వచ్చిందంటారు విశ్వామిత్రులవారు. అసలు విశ్వామిత్రులవారికి దివ్యాస్త్రాలన్నీ ప్రసాదించింది పరమశివుడే. శివుడిచ్చిన ఆ అస్త్రబలాన్నే ఆయన రాముడికి ఆయన ఆ తరువాత కాలంలో ప్రసాదించారు. అలానే కౌసల్యాదేవి శివుణ్ణి పూజించేదన్న విషయం, చిత్రకూటంలో పర్ణశాల కట్టుకున్న సమయంలో వాస్తుపూజలో భాగంగా రాముడు శివుడిని కూడా పూజించాడన్న విషయాలు మనకు అయోధ్యకాండ, అరణ్యకాండలో కనబడతాయి. అలానే అరణ్యకాండలో ఒకచోట ఆదర్శదంపతులైన సీతారాములను ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులతో పోల్చి చెబుతారు వాల్మీకి మహర్షి. ఇక కిష్కింధకాండ, సుందరకాండలలో కూడా శివుడి పేరు చాలాసార్లు వినబడుతుంది.
యుద్ధకాండలో అయితే సరేసరి. ఆ కాండలో అనేక సందర్భాలలో శివుడి పేరు వినబడుతుంది. యుద్ధంలో ఒకానొక సమయంలో అరివీరభయంకరంగా పరాక్రమించిన రాముడు.. నేను శివుడు తప్ప ఇలాంటి యుద్ధం ఇంకెవ్వరూ చెయ్యలేరంటూ, వాళ్ళిద్దరూ ఒక్కటేనని పరోక్షంగా చెబుతాడు. రామయణం మొత్తంలో అనేకచోట్ల వాల్మీకి మహర్షి శివుడిని మహాదేవుడు అనే నామంతో పిలుస్తారు. ఇవి కాకుండా ఇంకా హరుడు, భవుడు, త్ర్యమ్బకుడు, త్రినేత్రుడు, వృషధ్వజుడు, ఉమాపతి, పశుపతి, శూలి ఇలా అనేక నామాలతో ఆ స్వామిని పేర్కొంటారు. శివుడి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన దేవాధిదేవుడనో, సకలలోక పూజ్యుడనో, దేవేశ్వరుడనో ఇలా ఏదో ఒక విశేషణాన్ని కచ్చితంగా వాడతారు వాల్మీకి.
రావణసంహారం తరువాత పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ సముద్రతీరంలో ఒకచోట ఇక్కడే నేను మహాదేవుడిని పూజించానని సీతతో చెబుతాడు రాముడు. కొందరు ఈ విషయంలో మహాదేవుడంటే శివుడు కాదని అంటుంటారు. కానీ అది ఏ మాత్రం తర్కానికి నిలబడని వాదన. అంతకు ముందు సర్గలలో త్రినేత్రుడు, వృషభధ్వజుడు అయిన మహాదేవుడు అంటూ వాల్మీకి శివుడి గురించి స్పష్టంగా మూడు నాలుగుసార్లు చెప్పి ఉండటం వల్ల, రాముడు పూజించినది శివుడినే అని స్పష్టమవుతోంది.
ఇలా రామాయణంలో పరమేశ్వరుడికి సంబంధించిన ప్రస్తావనల్ని "రామాయణంలో శివుడు" అనే పేరుతో మన అజగవలో ఒక అరగంట నిడివి ఉండే వీడియో చేశాను. అక్కడ ప్రతీ విషయం దగ్గరా అది ఏ కాండో చెబుతూ, సర్గ సంఖ్యతో పాటూ, శ్లోకాల సంఖ్యలను కూడా ఇచ్చాను. రాముడంటే సాక్షాత్ శ్రీమహావిష్ణువు, ఆ స్వామికి పరమేశ్వరుడికి భేదం లేనేలేదు. ఈ విషయం స్పష్టంగా తెలియాలంటే ఆ వీడియోని ఆసాంతం చూడండి.
జయ శ్రీరామ - జయ పరమేశ్వర
వీడియో లింకు ఈ క్రింద ఇస్తున్నాను.
https://youtu.be/D7vXZWv6s3s
9 months ago | [YT] | 253
View 9 replies
Ajagava
9 months ago | [YT] | 412
View 27 replies
Ajagava
“ఓరేయ్ డాడీ! నువ్వు మీ అమ్మ పార్టీయా? నా పార్టీయా?” మా నాన్నగారి ప్రశ్న.
“నేను అమ్మ పార్టీనే” క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మను వాటేసుకుని మరీ ఖరాఖండీగా చెప్పేసేవాడిని. అప్పుడు మా అమ్మ “నా బంగారం” అంటూ నన్ను ముద్దు పెట్టుకునేది. అప్పటికే మా అక్క, మంచం మీద కూర్చున్న మా నాన్నగారి మెడ చుట్టూ వెనకనుండి చేతులు వేసి ఊగుతూ ఉండేది; తననా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదన్నట్టు ముఖం పెట్టి. అలా నేను, మా అక్క అమ్మానాన్నలు అనే రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. నా సమాధానం వినగానే నవ్వుతూ ఉరిమేవారు మా నాన్నగారు. మా అమ్మ కూడా కిలకిలమని నవ్వేసేది. రాత్రి భోజనాలయ్యాక, యథాప్రకారం నాన్నగారు మంచం మీద పడుకుని కబుర్లు చెబుతుంటేనో, పద్యాలు పాడుతుంటేనో ఆయనకు చెరో పక్కా చేరిపోయేవాళ్ళం అక్కా, నేను. ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని అతుక్కుపోయేవాళ్ళం. “ఏరా! ఇందాక అడిగితే నువ్వు మీ అమ్మ పార్టీ అన్నావ్. మళ్ళీ నా దగ్గరకొచ్చేవేంటి” అనేవారు నాన్నగారు నవ్వుతూ. నేను సమాధానం ఏమీ చెప్పకుండా ఇంకాస్త గట్టిగా వాటేసుకునేవాడిని. మా నాన్నగారి కబుర్లు కొనసాగిపోతూ ఉండేవి. అవి వింటూ వింటూ మేం నిద్దట్లోకి జారిపోయేవాళ్ళం.
ఇలా ప్రతీరోజు బోలెడు కబుర్లు. బోలెడన్ని పద్యాలు, చెప్పలేనన్ని సరదాలు.
“ఎవ్వడ వోరి? నీకు ప్రభు వెవ్వడు చెప్పుము? నీ విటొంటిమై
నివ్వనరాశి దాటి యిట కే గతి వచ్చితి? నామ మేమి? నీ
వెవ్వని ప్రాపునం బెఱికితీ వనమంతయు..”
ఇలా రావణాసురుడు హనుమంతుని గద్దిస్తూ ప్రశ్నించే పద్యాన్ని ఆ దానవ చక్రవర్తి ఇలాగే పాడతాడేమో అన్నట్టు గంభీరంగా పాడేవారు మా నాన్నగారు.
“ఖండించెద నీ చేతులు,
తుండించెద నడుము రెండు తునుకలు గాగన్
జెండించి నీదు కండలు
వండించెద నూనెలోన వారక నిన్నున్” అంటూ అదే ఉధృతితో ఇంకొక పద్యాన్నీ పాడేవారు. తరువాత “ఇట్లు పట్టరాని కోపంతో నాటోపంబుగా పలుకుచున్న రావణాసురునితో హనుమంతుడు ఏమన్నాడయ్యా అంటే..” అని వచనంగా అంటూ..
“ఇనతనయుని వరమంత్రిని,
జనపతి యైనట్టి రామచంద్రుని దూతన్
ఘనుడగు వాయుకుమారుడ
వినుమీ హనుమంతు డనగ వెలసినవాడన్”
అని హనుమంతుడు పాడినట్టే హాయిగా, స్థిరంగా, రాగం తీస్తూ పాడేవారు. ఈ పద్యాలన్నీ మొల్ల రామాయణంలో పద్యాలని నాకు ఆ తరువాత కాలంలో ఎప్పుడో తెలిసింది.
ఇక ఆయన పోతనగారి గజేంద్రమోక్షం పద్యాలు పాడుతుంటే ఆనందం పట్టలేకపోయేవాడిని. నాది ఆ పద్యాల అర్థం గురించి, పోతనగారు చెప్పదలచుకున్న భగవంతుని తత్త్వం గురించి ఇలా ఏమీ తెలియని, తెలుసుకోలేని వయసే అయినా, వాటి నడకలో ఉండే అందమైన సొగసు, మా నాన్నగారి మధురమైన కంఠంలో ప్రవేశించి అక్కడనుండి నా చెవుల ద్వారా మనసు లోపలికి వెళ్ళిపోయి, కాలక్రమంలో ఆ పద్యాలన్నీ కంఠతా వచ్చేశాయి.
“సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీరుక్మిణీ సత్యభామాపతే
వాణీపతే బ్రహ్మ గౌరీపతే శంభొ లక్ష్మీపతే శ్రీమన్నారాయణా!”
అనే పద్యాన్ని రోజూ రాత్రి ప్రార్థనా శ్లోకంగా చదువుకునేవాళ్ళం.
అప్పుడప్పుడూ మా అమ్మ కబుర్ల మధ్యలో సరదా పొడుపు కథలు అడుగుతుండేది.
“మా నాన్నగారు ఎవరికి మామగారో, వాళ్ళ కోడలి నాన్నగారు మా కొడుక్కి మామగారు” ఇదేంటో చెప్పుకోండి చూద్దాం అనేది.
“అత్తగారి అత్తగారు మామగారి తల్లికి ఏమవుతుంది?” అంటూ వెంటనే మరో పొడుపుకథ పొడిచేది. నేనూ మా అక్కా తెగ లెక్కలు వేసేసేవాళ్ళం. సమాధానం చెప్పగలిగిన వాళ్ళకు మా అమ్మ పెట్టే ముద్దే పెద్ద బహుమానం. మీరు చెప్పలేకపోయారంటూ మా అమ్మ మా నాన్నగారిని ఎత్తిపొడిచేది. మేం మా నాన్నగారి వంక విజయగర్వంతో చూసి, మళ్ళీ ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని పడుకునేవాళ్ళం.
ఇక్కడ నా పేరు వెనుకనున్న చిన్నపాటి కథను కూడా చెప్పుకోవాలి. నేను పుట్టే సమయానికి మా నాన్నగారు భీమవరంలో లేరు. ఏదో పని మీద మద్రాసు వెళ్ళారు. బహుశా అందుకేనేమో నా పేరుకి కాస్తంత అరవ సువాసన అబ్బి, పదహారణాల తెలుగుతనంలో ఒక అణా తగ్గింది. అయినా అది అరవ రవం కాదు, సంస్కృత సంబోధనే అనుకుంటూ ఆనందిస్తుంటాను నేను.
జాతకం ప్రకారం నా పేరు 'త'కారంతో మొదలవ్వాలని జ్యోతిష్కుడు చెప్పాడట. మా నాన్నగారికేమో నాకు వాళ్ళ నాన్నగారి పేరైన “కామరాజు” అని పెట్టాలని కోరికట. ఈలోగా మా అమ్మేమో “మనవాడి పేరులో శ్రీకృష్ణుని పేరు కలిసేలా చూడండి. వాడు పుట్టే ముందురోజు నాకు కృష్ణపరమాత్మ కలలోకి వచ్చాడు” అందట. ఈ 'త'కారంతో, మా తాతగారి పేరైన కామరాజుని, మా అమ్మగారి కోరికైన శ్రీకృష్ణుడి పేరునీ జత చేయడానికి మా నాన్నగారు బోలెడంత నామ యోగసాధన చేయాల్సి వచ్చింది. అలా “త్రిసత్యకామరాజన్” అనే ఇంతముందు ఈ భూమ్మీద లేని పేరొకటి ఉద్భవించింది.
తీరా నా పేరు చూసి.. ఇందులో కృష్ణుడెక్కడున్నాడంటూ మా అమ్మగారు యుద్ధానికి సిద్ధమవుతుంటే.. “కృష్ణుడన్నా సత్యనారాయణస్వామన్నా విష్ణుమూర్తి అవతారాల బాపతే కదే పిచ్చిదానా!. అందుకే ఆ పేరునే కుదించి “సత్య” అని మనవాడి పేరులో కలుపుతున్నాం.” అని కాస్తంత అద్వైతం చెప్పి యుద్దాన్ని నివారించారట. “మరి ఆ రాజన్ ఏమిటి మరీ తమిళ పేరులాగా?” అని అడిగిందట మా అమ్మ. అందుకు మా నాన్నగారు “త్రిసత్యకామరాజు అంటే ఏదో ఎబ్బెట్టుగా తోస్తోంది.. అందుకే “త్రిసత్యకామరాజన్” అని కాస్తంత కొత్తదనం కలిపానులే” అన్నారట. దానితో మా అమ్మ పూర్తిస్థాయిలో శాంతించిందట. మా నాన్నగారికి నా పేరుని పి.టి.ఎస్.కె. రాజన్ అనో రాజన్ పి.టి.ఎస్.కె. అనో వ్రాయడం ఇష్టం. ఆయన మొబైల్లో కూడా నా పేరు అలానే ఉండేది. అలా ఆయనిష్టమే నా ఇష్టంగా మారిపోయి రాజన్ పి.టి.ఎస్.కె అన్న పేరుని స్థిరపరచుకున్నాను.
చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి ఇలా పిల్లల కథల పుస్తకాలన్నీ, ప్రతీనెలా క్రమం తప్పకుండా తీసుకొచ్చేవారు మా నాన్నగారు. ఆ పుస్తకాలు వచ్చినరోజు పండగలా ఉండేది నాకు. ఇక మా భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాల సమయంలో అయితే మా ఆనందం పట్టలేనంతగా ఉండేది. మేం నలుగురం సరదాగా నడుచుకుంటూ, చిన్నవంతెన మీదుగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ ఉత్సవంలో పెట్టిన లైటింగులు చూస్తూ.. నేను, మా అక్క నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరువాత ఇది బావుంటుంది. అది బావుంటుంది అంటూ మిరపకాయబజ్జీలు, జిలేజీలు, బజ్జీమిక్చర్లు ఇలా అన్నీ నాన్నగారు కొనిపెట్టడం, అక్కా, నేనూ తింటూ గెంతులెయ్యడం. ఇలా గంటన్నరో రెండు గంటలో గడచిపోయేది. “ఇంటికి వెళ్ళాక అన్నాలు తినాలి కదా! ఇక చాలు పదండి” అని అమ్మ హుకుం జారీచేసేది. మేం నాన్నగారి వైపు దీనమైన ముఖాలతో చూసేవాళ్ళం. “ఏం పర్లేదు మీరు కానివ్వండి” అన్నట్టు ఆయన తల ఊపేవారు. మళ్ళీ కథ మొదటికొచ్చేది.
చిన్నప్పుడు మా అల్లరికి నాన్నగారి చేతిలో దెబ్బలు తిన్నరోజులు కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే.. దెబ్బలు తిన్నరోజు కూడా మాకు పండగ రోజే. కోపంతో రెండు దెబ్బలు వేసినా, ఆ తరువాత ఆయన విలవిల్లాడిపోయేవారు. ఆరోజు సాయంత్రం సినిమాకి తీసుకువెళ్ళడమో, ఐస్ క్రీమ్స్ తీసుకురావడమో చేసేవారు. ఇక సినిమాకి వెళ్ళిన ప్రతీసారి ఇంటర్వెల్లో నాకూ, మా అక్కకు గోల్డ్ స్పాట్ తప్పనిసరి. మా అమ్మకు అయితే లిమ్కా. నాకు మా అమ్మ లిమ్కాలో కూడా వాటా ఉండేది. వీటితో పాటు సమోసాలు, తినే గొట్టాలు కొనేవారు.
నేను ఇంటర్లో ఉండగా, అమ్మ, నాన్న, అక్క, నేను, మా నాయనమ్మ కలసి కారులో బెజవాడ కనకదుర్గ గుడి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, బ్రహ్మంగారి మఠం, పెద్దతిరుపతి ఇలా పదిరోజుల యాత్ర చేశాం. ఆ యాత్రలో చిలుకలూరి పేటలో తిన్న సాంబార్ ఇడ్లీ, నంధ్యాలలో తిన్న భోజనం, తిరుమల ఉడ్ ల్యాండ్లో తిన్న చపాతీల రుచి ఎంతగా గుర్తున్నాయో, ప్రయాణం సాగుతున్నంతసేపూ మా నాన్నగారు చెప్పిన విశేషాల రుచి వాటన్నింటికంటే ఎక్కువగా గుర్తుంది. ఇలా ఆ యాత్రాకాలం అంతా బోలెడన్ని అనుభూతులు, చెప్పలేనన్ని సరదాలతో సాగిపోయింది. అనుభూతులంటే ఒక విషయం గుర్తుకువస్తోంది.
ఇప్పటికీ ఆరోజు నాకు బాగా గుర్తు. ఆరాత్రి పెద్ద వర్షం. కుండపోతగా కురిసేస్తోంది. కరెంటు లేదు. అప్పటికే భోజనాలు అయ్యి చాలా సేపయ్యింది. అందరం మంచం మీదకు చేరిపోయాం. ఉరుములు, మెరుపులు. ఆ వర్షం పడుతున్న శబ్దం మా పెంకుటింటి మట్టి గోడల్లోంచి భీకరంగా వినబడుతోంది. అమ్మానాన్నల మధ్యలో పడుకున్న నాకూ, మా అక్కకూ చెప్పలేనంత సంబరంగా ఉంది. అంతోటి వరుణదేవుడు కూడా అమ్మానాన్నల మధ్యలో పడుకున్న మమ్మల్ని భయపెట్టలేకపోతున్నాడు. అంత చలిలోనూ మాకు వెచ్చగానే ఉంది. నాన్నగారు “తోకపీకుడు కథ” అనే సరదా కథొకటి చెబుతున్నారు. ఇంతలో మా అమ్మ “మీరు చెబుతూ ఉండండి” అని నాన్నగారితో అని, ఆ చిన్న కిరసనాయిలు దీపం పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. దీపం అమ్మతోపాటూ వంటింట్లోకి వెళ్ళిపోవడం వల్ల మేమున్న గదంతా కారు చీకటి అయిపోయింది. ఇంతలో మా నాన్నగారు సిగరెట్టు వెలిగించారు. ఆ చిమ్మ చీకటిలో సిగరెట్టు చివర ఉన్న ఎర్రటి వెలుగు ఒక్కటే కనబడుతోంది. భలేగా ఉందనిపించింది. అప్పటికి నాకు ఆరేడేళ్ళకు మించి ఉండుండకపోవచ్చు. కానీ ఇప్పటికీ ఆ వెలుగు నాకు స్పష్టంగా కనబడుతున్నట్టే ఉంటుంది. ఇంతలో అమ్మ వంటింటిలోనుండి వేయించిన వేరుశెనగ గుళ్లు ప్లేటులో వేసి తీసుకు వచ్చింది. ఆ వర్షంలో, ఆ చిమ్మచీకటిలో, వేయించిన వేరుశెనగ గుళ్ళు తింటూ నాన్నగారు చెప్పే కథ వినడం, అప్పుడు పొందిన ఆ ఆనందానుభూతి... మూడు దశాబ్దాలు గడచినా, ఇప్పటికీ తలచుకున్నప్పుడల్లా నా శరీరం పులకిస్తూనే ఉంటుంది.
మా నాన్నగారు కీ.శే. పెట్ల వీరభద్రరావుగారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం, చల్లవాని పేట దగ్గరలో ఉన్న జోనంకి అనే గ్రామంలో పుట్టారు. పెట్ల కామరాజు గారు, మాణిక్యమ్మల ఆరవ సంతానం. ఆయనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. తన పదిహేనవ యేట మాకు నిత్య స్మరణీయులైన శ్రీ ఇందుకూరి రామరాజు గారు చూపించిన అభిమానం కారణంగా.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని గరగపర్రు వచ్చారు. వారి కుటుంబంలో ఒకరిగా పెరిగారు. రామరాజుగారి కుమారుడైన మా బాబుల్ అన్నయ్య, రామరాజుగారి తమ్ముడైన మా బుల్లినాన్న మా నాన్నగారికి ప్రాణస్నేహితులు. వీళ్ళిద్దరి పేర్లూ కూడా ఇందుకూరి త్రినాథరాజే. ఆ తరువాత భీమవరంలోనే పుట్టి పెరిగిన మా అమ్మ లక్ష్మీరాజేశ్వరిని పెళ్ళాడి దేవి, రాజా అనే మా అక్కను, నన్ను ఈలోకానికి తీసుకొచ్చారు. మమ్మల్ని లాలించారు, ఆలించారు, ప్రేమించారు. ఏ లోటూ లేకుండా పెంచారు. పదిమందిలోనూ చాలా మంచి పేరు సంపాదించారు. భీమవరంలో అందరూ ఆయనను గురువు గారని పిలిచేవారు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే మా నాన్నగారు, ఆ అలవాటుతోనే, సరిగ్గా పదమూడేళ్ల క్రితం మా అక్క కొడుకుని ఆడిస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిరావాలనే ఆయన కోరికతీరకుండానే ఆయన తన అరవయ్యో యేట సరాసరి కైలాస యాత్రకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆయనను గుర్తుచేసుకున్నప్పుడల్లా.. “గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న నన్నయ్యగారి మాటే గుర్తుకు వస్తుంటుంది. నాన్నగారి జ్ఞాపకాలకు అంతులేదు. ఆయన రూపానికి నా మనసులో ఎప్పుడూ మరపురాదు. “ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న” అన్న సినారె గీతాన్ని పదే పదే స్మరించుకుంటూ, మా నాన్నగారికి నమస్కరించుకుంటూ
స్వస్తి!
- రాజన్ పి.టి.ఎస్.కె
1 year ago | [YT] | 795
View 89 replies
Ajagava
“కళ్ళుంటే కలకత్తా చూడాలి. లేదంటే బరంపురం చూడాలి!” - ఇది మా నాయనమ్మ నోట్లో నానుతుండే మాట. తొంభైయేళ్ళ పాటు సులోచనాలు అవసరం పడని చక్కని కళ్ళున్నా.. ఆవిడెప్పుడూ కలకత్తా చూడలేదు. తన చిన్ననాటి జ్ఞాపకాలున్న బరంపురానికి, పెరిగి పెద్దయిన తరువాత మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. నాన్నమ్మ కళ్ళే కాదు, పళ్ళు కూడా గట్టివే. జీవిత చరమాంకం వరకూ, ఆవిడ నవ్వినప్పుడల్లా... 32 పళ్ళూ మెరుస్తూనే ఉండేవి.
తను పుట్టిన సంవత్సరం నాన్నమ్మకు గుర్తులేదు. “నీ వయసెంత నాన్నమ్మా?” అని అడిగితే... నాదీ, మా ముత్తింజంది ఒకటే వయసనేది. ఆ ముత్తింజం అన్నాయన మా నాయనమ్మకు మేనత్త కొడుకు. అసలు పేరు మృత్యుంజయం. పలకడానికి కొంచెం కష్టంగా ఉన్న ఆ పేరు, కుటుంబ సభ్యుల నోళ్ళలో నిటారుగా నిలబడలేకపోయింది. ముందు ఎగ్గొట్టబడి తరువాత దిగ్గొట్టబడింది. ప్రకృతి కాస్తా వికృతైపోయింది. నాలుగక్షరాల పేరు కుదించుకుని మూడక్షరాలలోకి వెళ్ళిపోయింది. చివరికి ఆ మృత్యుంజయం అన్నపేరు ముత్తింజంగా మారిపోయింది. ఇంతకీ ఆ ముత్తింజం గారి వయసు కూడా మనకు తెలియదు.
మా పెద్ద మేనత్త పుట్టిన సంవత్సరమే “కనకతార” సినిమా వచ్చిందని, తానా సినిమాకు వెళ్లానని నాన్నమ్మ చెబుతుండేది. లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు ఇచ్చిన సమాచారం ప్రకారం మా పెద్ద మేనత్త పుట్టింది 1937లో అయ్యుండాలి. మా మిగతా మేనత్తలు, పెదనాన్నల వయసులని బట్టి లెక్కేస్తే, ఆ లెక్కకు ఆ సంవత్సరం సరిపోతుంది. ఈ లెక్కల ప్రకారం మా నాయనమ్మ వయసుని అంచనా వేస్తే, ఆవిడ పుట్టిన సంవత్సరం 1920 కి కొంచెం అటో ఇటో అయ్యుండాలి. ఇప్పుడు నాయనమ్మ ఉండుంటే, బహుశా ఆవిడకు 104 వ యేడు నడుస్తుండేది.
నాయనమ్మకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. మా నాన్నగారు మూడో కొడుకు. అప్పట్లో మేం భీమవరంలో ఉండేవాళ్ళం. నాయనమ్మ తన కొడుకులందరి దగ్గరా కొన్ని కొన్ని నెలల పాటు ఉంటూ ఉండేది. భీమవరం వచ్చి రెండు మూడు నెలలు అవ్వగానే, నాన్నగారితో... “వెంకట్రావుని చూడాలని ఉందిరా అనో, గోవిందు గుర్తొస్తున్నాడనో, రమణమూర్తి ఎలా ఉన్నాడో!” అనో అంటుండేది. అంటే శ్రీకాకుళం వైపో, వైజాగు వైపో, తన మనసు తిరిగిందని, ప్రయాణానికి సిద్ధం చెయ్యమని చెప్పడమన్నమాట. వెంకట్రావంటే మా చిన్న పెదనాన్న గారు, గోవిందరావు అంటే మా చిన్నాన్న గారు, రమణమూర్తి అంటే మా పెద్ద పెదనాన్న గారైన రామారావు గారి పెద్దబ్బాయి. అలా శ్రీకాకుళం అక్కడకు వెళ్లి కొన్ని నెలల పాటూ ఉన్నాక, మళ్ళీ భీమవరం వైపు మనసు మళ్ళేది మా నాయనమ్మకు. అయితే.. కొడుకుల దగ్గర ఎంత సౌకర్యంగా ఉన్నా, కోడళ్ళు ఎంతో అభిమానంతో చూసుకుంటున్నా ఆవిడ మనసు మాత్రం ఎప్పుడూ ఒక పల్లెటూరు వైపుకి పరుగుతీసేది. ఆ ఊరు పేరు “జోనంకి”. శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలో, చల్లవాని పేట ప్రక్కనే ఉండే చిన్నపాటి గ్రామమది. మా తాతగారైన పెట్ల కామరాజు గారిని పెళ్లాడి, మా నాయనమ్మ కాపురానికి వచ్చిన ఊరు. “ఓ...మాణిక్యమ్మోయ్”, “ఓ...మాణిక్యం అక్కయ్యోయ్” అన్న మాటలు 60 యేళ్ళ పాటు ఆవిడ చెవులలో రోజూ ప్రతిధ్వనించేలా చేసిన ఊరు. అన్నిటికన్నా ముఖ్యంగా మా నాయనమ్మకు కథలు, పాటలు నేర్పించిన ఊరు. అక్కడ నుండే మా నాయనమ్మ కొడుకుల దగ్గరకు, కూతుళ్ళ దగ్గరకు వెళుతుండేది.
భీమవరం ఎప్పుడు వచ్చినా, అక్కడ ఉన్నంత కాలం రోజూ రాత్రి పడుకునేటప్పుడు కోరికోరి కథలు చెప్పించుకునేవాళ్ళం. పాటలు పాడించుకునేవాళ్ళం. మాకు అన్నం తినిపించేటప్పుడు ఈ కథలు, పాటలనే తను తాయిలాలుగా వాడేది.
“చిన్నికృష్ణ చిన్నికృష్ణ వెన్నల దొంగ
మా గోవులన్ని తోలుకుని వేగము రారా
భలే బాగుగ రారా
అమ్మ నాకు బంగారు బండినియ్యవే
గుఱ్ఱంబునెక్కెదన్ ఏనుగంబు నెక్కెదన్
కిర్ కర్ కిర్ కర్”
ఈ ముద్దులొలికే గీతం యశోదా, బాలకృష్ణుల సంవాదంలోనిది. చివరిలో చిన్నికృష్ణుడు ముద్దుగా నడుచుకుంటూ వస్తుంటే అతని చెప్పుల శబ్దాన్ని అలా కిర్ కర్ కిర్ కర్ అంటూ నాయనమ్మ శ్రావ్యంగా పాడుతుంటే బలే గమ్మత్తుగా ఉండేది.
ఈ పాటనే కాదు, సందర్భానికి తగ్గట్టుగా ఎన్నో హుషారైన పాటలు పాడేస్తుండేది మా నాయనమ్మ. మా పెద్దపెదనాన్నగారమ్మాయి శాంతక్క పెళ్ళిలో... “బావగారికి మర్యాద చెయ్యండిరా!” అని మాతో అంటూ, ఎలా చెయ్యాలో కూడా చెప్పింది.
“బావగారు రండి మీకు బడాయేల నండి
కోటు జేబులోన గడియారమున్నదండి
తన్నుకుంటెగాని మీకు టయము తెలియదండీ...” ఇలా అన్న మాట. ఇంకా ఆ పాట చాలా పొడవుందటుంది గాని, నాది మా నాయనమ్మ స్థాయి జ్ఞాపకశక్తి కాకపోవడంతో, ఆ పాటలోని చరణాలన్నీ జారిపోయి, కేవలం ఈ పల్లవి ఒక్కటే నా మస్తిష్కంలో మిగిలిపోయింది.
కుచేలుడు అనేక సంవత్సరాల తరువాత కృష్ణ దర్శనం చేసినప్పుడు కృష్ణుడు పాడే... “కుచేలా నిన్ను చూచి చాలా దినములాయె...” అనే పాట హృదయానికి హత్తుకునేలా పాడేది. కృష్ణుడు, కుచేలుడు సాందీపుని వద్ద చదువుకోవడం, వాళ్ళు అడవిలోకి కట్టెలకని వెళ్ళి తప్పిపోవడం, ఆపై పెద్ద వర్షంలో చిక్కుకుపోవడం... ఇలా ఆ ఘట్టాలన్నీ మధురమైన జానపదశైలిలో విన్నవారి మనసులకు హాయి కలిగించేలా పాడేది.
అలాగే, రైలు బండి మీద...
“మైము అంటె రైము జేసె
మాయదారి రైలు బండి
మైలు టపా జనము తోటి
మదరాసు నుండి
భుగభుగమని భూమితోడ
ఎక్కీ దిగే జాతులెల్ల
వేగిరముగ వెడలిపోయే
వాల్తేరు పొగబండి..” అనే పాట పాడేది. అంత్య ప్రాసలతో గూడ్సు రైలంత పొడవుండే ఆ అందమైన పాటలో, ఇప్పుడు ఈ ఒక్క భోగీనే మిగిలింది.
ఇంకొకపాట మధ్యలో...
“అంగమాను కొండ మీద కొంగ ఉన్నది
కొంగ కడుపులోన శివ లింగమున్నది.” అని వస్తుంది. ఆ పాట మొదలు మాత్రం ఎంత ప్రయత్నించినా తట్టడం లేదు. పెద్దలెవరికైనా ఈ పాట తెలుసుంటే చెప్పవలసిందిగా మనవి. ఆ పాట మొత్తం దొరికితే మా నాయనమ్మే తిరిగొచ్చి పాడినంత సంతోషం కలుగుతుంది.
ఇక నాన్నమ్మ దగ్గర మా నాన్నగారు నేర్చుకుని పాడిన పాటలు మాత్రం బాగానే గుర్తున్నాయి.
“చిట్టెమ్మెక్కిన రైలు బండి చీపురుపల్లి స్టేషను కాడ
శీల జారిపోయిందే రయ్యో కొయ్యోడా
ఆ ముండగొల్లిగాడు నా చెయ్యి పట్టుకుంటే
నా ఒళ్ళు ఝల్లు మన్నదో రయ్యో కొయ్యోడా” అనే పల్లెపాట ఎన్నిసార్లు విన్నా సరదాగానే ఉండేది.
అలాంటిదే ఇంకొక జానపద గీతం...
“కాలు మీద కాలు పెట్టి తొక్కి తొక్కి తన్నుతుంటే
కంసాల్ సూరన్న నాకు కాల జగడమన్నదే కోడీ పిల్ల
అంచూన చితక పెట్టి ఇంచూగ తింటు ఉంటే
చీకటి జలాంతరమంత చూసి వస్తనన్నదే కోడి పిల్ల
పొద్దున్న లేవగానే దేహ శుద్ధి చేస్తుంటే
గద్దతో యుద్దాని కెళతానన్నదే కోడీపిల్ల”
ఇలా ఎన్నో ఎన్నెన్నో పాటలు. రాత్రి భోజనాలయ్యాక అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ఒక్కోసారి మా నాన్నగారు జానపదగీతాలు పాడుతుండేవారు. ఆయన పాడుతున్నదాంట్లో చిన్నపాటి తప్పుదొర్లినా, కొంచెం బాణీ తప్పినా “అస్సే...అలా కాదు!” అంటూ, ఒక చేత్తో నాన్నగారిని వారించి తను అందుకునేది.
పడుకునే ముందు అక్క నేను నాయనమ్మ ప్రక్కకు చేరిపోయేవాళ్ళం. నక్క పెంచిన రాజకుమారి కథ, మాయా విసనకర్ర కథ, బాలనాగమ్మ కథ ఇలా బోలెడన్ని కథలు నిద్ర తేలగొట్టుకుంటూ మరీ వినేస్తుండేవాళ్ళం. అలా చెవులు చేటలు చేసుకుని మరీ వినే బృందంలో.. నేను, మా అక్కతో పాటు మా అమ్మ, నాన్న కూడా ఉండేవారు.
బాలనాగమ్మ కథలో... తన నెలల వయసున్న కొడుకు బాలవర్ధిరాజు ఎడుస్తుంటే, అతణ్ణి లాలించడానికి ఉయ్యాల వద్దకు వెళుతుంటుంది బాలనాగమ్మ. ఈలోగా మాయల ఫకీరు వచ్చి ఓమ్ భీమ్ బుష్ అని ఓ మంత్రం చదివేసి, ఆమెను కుక్కగా మార్చేసి తీసుకు వెళ్ళిపోతాడు. అక్కడ వరకూ మా నాన్న కథ చెప్పగానే నాకు మా అక్కకు ఏడుపొచ్చేసేది. పాపం బాలనాగమ్మ అనుకుంటూ కన్నీళ్ళు కార్చేసేవాళ్ళం. ఇక అక్కడనుండి కథ పూర్తయ్యే వరకూ కళ్ళు పెద్దవి చేసుకుని, మధ్య మధ్యలో “ఆ.. ఆ తరువాత ఏమయ్యింది” అని ఆరాటంతో అడుగుతూ, నాయనమ్మ ముఖం వంకే చూస్తూ కథ వినేవాళ్ళం.
కేవలం కథల్ని ఆసక్తికరంగా చెప్పడమే కాదు, తన చిన్నప్పటి సంగతుల్ని కూడా అందమైన కథల్లానే చెప్పేది మా నాయనమ్మ. మా నాన్నమ్మంటే వాళ్ళ నాన్నగారికి చాలా గారాబం. కూతురు స్కూల్కి వెళ్ళడానికని ఒక గొర్రెపోతు బండిని స్వయంగా తయారు చేశారట. ఆయన బెండపూడి సాధువు గారి శిష్యులు. ఇక వాళ్ళింట్లో పెరిగే దుప్పి, పిల్లి, కుక్క, చిలుక నాయనమ్మకు చిన్నప్పటి నేస్తాలు. వాటిలో చిలుక, పిల్లి చాలా స్నేహంగా ఉండేవట. ఒకరోజు ఆ రెండూ ఎప్పటిలానే ఆడుకుంటూ హుషారుగా ఉన్నాయట. ఆ పిల్లి ఆటకన్నట్లుగా చిలుక మెడను మెల్లిగా పట్టుకుందట. కానీ పొరపాటున ఆ పిల్లి పన్నొకటి చిలుక మెడలో గుచ్చుకుపోయి, ఆ చిలుక చనిపోయిందట. చిలుక చనిపోయిందన్న బెంగతో ఆ పిల్లి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం మానేసి, కొన్ని రోజులకే చనిపోయిందట. ఈ విషాధ గాథ వినగానే దుఃఖం పొంగుకొచ్చేది.
మా నాయనమ్మ చాలా సరదా మనిషి కూడా. చమత్కారంగా మాట్లాడుతూ మమ్మల్ని నవ్విస్తుండేది. ఒకసారి మా చిన్న మేనత్త కొడుకు శంకరం బావకు ఎలుగుబంటి కలలోకి వచ్చింది. అతనా విషయం మా నాయనమ్మకు చెప్పి “అమ్మమ్మా! ఎలుగుబంటి కలలోకి రావడం మంచిదేనంటావా” అని అడిగాడు. మా నాయనమ్మకు మా శంకరం బావను ఆట పట్టిచడమంటే సరదా. దానితో “చాలా అశుభంరా శంకరం. ఎలుగంటే నల్లనిది, ఒళ్లంతా వెంట్రుకలుంటాయ్, రక్తం తాగుతుంది కూడా.. అటువంటి జంతువు కలలోకి వస్తే ఇబ్బందే అంది.” మా బావ కంగారుపడిపోయాడు. మా నాన్నమ్మ బెదరగొడుతోందని మా నాన్నగారికి తెలుసును కనుక, నవ్వుకున్నారు. ఆపై మా పెదనాన్నగారి అబ్బాయి రమణమూర్తిని పిలిచి, “ఒరేయ్ రేపు శంకరం ఉండగా నువ్వు కూడా నాన్నమ్మతో నీకు కూడా ఎలుగుబంటి కలలోకి వచ్చిందని చెప్పు, ఏమంటుందో చూద్దాం” అన్నారు. సరేనన్న మా అన్నయ్య, మర్నాడు మా నాయనమ్మతో ఆ మాటే అడిగాడు. “నాన్నమ్మా! నాకు కలలోకి ఎలుగుబంటి వచ్చింది, మంచిదేనంటవా?” అని. వెంటనే మా నాయనమ్మ “జాంబవంతుడురా నాన్నా! ఎంతో శుభం. నల్లని జంతువు కదా ఇంకా మంచిది. కృష్ణుడు నలుపు, రాముడు నలుపు” అంది. మరి రక్తం తాగే జంతువు కదా, పర్లేదా అన్నాడు మా అన్నయ్య చిన్నగా నవ్వుతూ. “అడవిలో జంతువులు రక్తం కాక, పాలు తాగుతాయా..” అని నవ్వేసింది ఓరగా మా శంకరం బావను చూస్తే. మా బావ కోపంతో రెండు తాటిచెట్ల ఎత్తులో లేచాడు. మేమంతా పకపకా నవ్వులు. ఇలా ఎన్నో సరదాలు నాయనమ్మతో.
ఇంకా తను గాంధీగారిని చూసినప్పటి సంగతులు, తను చూసిన నాటకాల సంగతులు, అలనాటి సినిమా సంగతులు, తన పిల్లల చిన్నప్పటి సంగతులు.. ఇలా ఎన్నో విషయాలు కథలు కథలుగా చెబుతుండేది నాన్నమ్మ. నిజానికి అవన్నీ వ్రాసుకుంటూ వస్తే, ఒక మినీ నవలంత పుస్తకం సిద్ధమవుతుంది.
అప్పట్లో మా నాయనమ్మ భారతానికి సంబంధించిన పొడుపు కథొకటి అడుగుతుండేది. భారత రామాయణాలు జానపదుల నోళ్ళలో పడి చాలామార్పులకు గురవుతుంటాయి కనుక, వాటిని మూల కావ్యాలతో పోల్చి చూడకూడదు. అటువంటి దృష్టితోనే ఈ పొడుపు కథను కూడా విప్పాలి. ఇంతకీ ఆ పొడుపు కథ ఏంటంటే..
“మహారాజశ్రీ పెదనాన్నగార్లైన పెండ్లి కానిదాని కుమారుని సముఖమునకు,
నీ తమ్ముడు భార్య అన్న మేనత్తకు పెండ్లి అయిన తరువాత పుట్టిన పుత్రులలో పెద్దవాని తరువాత వాని పుత్రుడగు నేను వ్రాసుకున్న ఉత్తరము ఏమనగా, వేయికన్నులు గలవాని మనుమనికి ఇస్తామన్న పిల్లను నీ చెలికాడు, గర్భము కొట్టిన దాని కుమారు కుమారునకు అడుగుచున్నారట. తురంగమునకు పుట్టినవాని తండ్రియున్నూ, ఈశ్వరుని వాంఛించిన దాని అన్నయున్ను, నీవును వెళ్ళి అడుగుట ధర్మమా? మత్స్యములతో జీవనము చేసి జాలర్ల ఇంట తిరిగిన నీకు ఈ బుద్ధి పుట్టినా పుట్టుండవచ్చును పెదనాన్న!
ఇట్లు
నేనే.”
ఎవరు ఎవరికి వ్రాశారీ ఉత్తరాన్ని అన్నదే ఈ పొడుపు కథ? విప్పడానికి ప్రయత్నించండి!!
ఇవీ తన 90వ యేట స్వర్గారోహణం చేసిన మా నాయనమ్మ కబుర్లు. ఈపాటికి రంభా, ఊర్వశి, మేనకలతో... “కళ్ళుంటే కలకత్తా చూడాలి. లేదంటే బరంపురం చూడాలి.” అనే తన ట్రేడ్మార్క్ డైలాగు చెబుతూ, వాళ్ళను భూలోక ప్రయాణానికి ఊరిస్తూ ఉండుంటుంది. ఈ ముసలావిడ మాటలు పట్టుకుని, అప్సరసలెక్కడ భూలోకం వెళతామంటారో అని ఐరావతంపై తలపట్టుకుని కూర్చున్న ఇంద్రుణ్ణి చూసి నవ్వుకుంటూ ఉండుంటుంది. తన కోసం ఇన్ని మాటలు రాస్తున్న ఈ మనవడి వంక ప్రేమగా చూస్తూ... తన రెండు అరచేతులు బోర్లించి దీవిస్తూ ఉండుంటుంది.
స్వస్తి!
రాజన్ పి.టి.ఎస్.కె
1 year ago | [YT] | 592
View 67 replies
Load more